హోం

20, జనవరి 2012, శుక్రవారం

ప్రజాయుద్ధనౌక గద్దర్ ..


గద్దర్ అసలుపేరు గుమ్మడి విట్టల్ రావు, ఆయన మెదక్ జిల్లాలోని తూప్రాన్ గ్రామంలో 1949 లో జన్మించారు, ఆయన తల్లి తండ్రులు లచ్చమ్మ, శేషయ్యలు, ఆయనొక నిరుపేద, దళిత కుటుంబంలో జన్మించారు, ఆయన తల్లి తండ్రులు రోజు కూలిలుగా పని చేసి కుటుంబాన్ని పోషించేవారు, ఆయన మాధ్యమిక విధ్యాబ్యాసం మొత్తం నిజామాబాదు జిల్లా బోధనలో జరిగింది, ఆ తర్వాత ఇంజనీరింగ్ కోసం హైదరాబాద్ వచ్చారు.
              1969 తెలంగాణా ఉద్యమంలో గద్దర్ చురుగ్గా పాల్గొన్నారు, భావ వ్యాప్తికోసం ఆయన ఊరురు తిరిగి ప్రచారం చేసారు, దీనికొరకు ఆయన బుర్రకథ ను ఎంచుకున్నారు. ఆయన ప్రదర్శనను చూసిన సినిమా దర్శకులు బి.నరసింగరావు భగత్ సింగ్ జయంతి రోజున ఒక ప్రదర్శనను ఏర్పాటు చేసారు, ఆతర్వాత ప్రతి ఆదివారం ఆయన తన ప్రదర్శనలు ఇచ్చే వారు. కుటుంబ నియంత్రణ, పారిశుధ్యం వంటి అనేక సామాజిక విషయాల గురించి ఆయన బుర్రకతలను తయారు చేసుకొని ప్రదర్శించి ప్రజలకు అవగాహన కల్పించేవాడు. 1971 లో బి నరసింగ రావు ప్రోత్సాహంతో ఆయన తన మొదటి పాట ఆపర రిక్షా అనే పాట రాసారు, ఇది అప్పట్లో సూపర్ హిట్ అయ్యింది, ఆ తర్వాత ఆయన అనేక పాటలు రాసారు. ఆయన మొదటి ఆల్బం పేరు గద్దర్, ఇదే ఆయన పేరుగా స్థిరపడింది.

                  1972 లో జన నాట్య మండలి ఏర్పడింది, ఇది పల్లెల్లో జరుగుతున్న ఆకృత్యాలను ఎదురించెందుకు, దళితులను మేల్కొల్పెందుకు వారిని చైతన్య పరిచేందుకు ఏర్పడింది, అయితే 1975 లో గద్దర్ బ్యాంకు రిక్రూట్ మెంట్ ఎక్షమ్ రాసారు అయన కెనర బ్యాంకు లో క్లార్క్ గా చేరారు, తర్వాత వివాహం చేసుకున్నారు, భార్య పేరు విమల, ఆయనకు ముగ్గురు పిల్లలు, సూర్యుడు, చంద్రుడు( 2003 లో అనారోగ్యంతో మరణించారు) మరియు వెన్నెల. ఆయన మొదటిసారి మాభూమి సినిమాలో వెండి తెరపై కనిపించారు, సాయుధ పోరాట యోధుడు యాదగిరి పాత్రలో నటించి యాదగిరి పాడిన బండెనక బండి కట్టి అనే పాటను ఆయనే పాడి, ఆడారు.

                     1984 లో ఆయన ఉద్యోగానికి రాజీనామా చేసారు.  1985 లో కారంచేరు లో జరిగిన దళితుల హత్యలకు వ్యతిరేకం గా ఆయన కదం తొక్కారు, జన నాట్య మండలిలో చేరారు, జన నాట్య మండలి నక్సలైట్ ల అనుభంద సంస్థ. ఆయన అనేక గ్రామాలు  తిరుగుతూ తన పాట ద్వార, ఆయన ఎంచుకున్న ఒగ్గు కథ, బుర్ర కథ, ఎల్లమ్మ కథ ల ద్వార గ్రామీణ ప్రజల్లోకి వెళ్లి వారిని చైతన్య పరిచి వారిని ఉద్యమం వైపుగా మల్లిన్చగలిగారు. ఆయన ఇంటి పై పోలీసులు దాడి చేసారు, ఆయన అజ్ఞాతంలోకి వెళ్లారు, 
అజ్ఞాతంలో ఉన్న సమయంలో ఆయన మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఒరిస్సా, బీహార్ వరకు అనేక రాష్ట్రాల్లో తన ప్రదర్శనలు ఇచ్చి ప్రజలను చైతన్య పరిచారు.
       ఆయన కింద గోచి దోతి , పైన గొంగళి ధరించి ఉండేవారు. ఆయన పాడే పాటలకు ప్రజలు విచ్చు కత్తుల్ల మారేవారు, దళితులు పేదలు అనుభవిస్తున్న కష్ట,నష్టాలను ఆయన, ఆయన బృందం కళ్ళకు కట్టినట్టుగా పాటలు, నాటకాల రూపంలో తెలియ జెప్పేవారు, ఆయన పాటలు వందలు, వేలు కాసెట్ లు గా, సి డి లు గా రికార్డ్ అయ్యి అత్యదికం గా అమ్ముడుపోయాయి. ఆయన ఒక హీరో అయ్యారు.
                మర్రి చెన్నారెడ్డి రెండవసారి ముఖ్య మంత్రి గా ఉన్న సమయంలో నక్సలైట్స్ పై ఆయన ఉదారంగా వ్యవహరించారు, వారిపై నిషేధం ఎత్తి వేయబడింది. 1990 ఫిబ్రవరి 18 న జన నాట్య మండలి ఆధ్వర్యం లో గద్దర్ హైదరాబాద్ లోని నిజాం కాలేజీ గ్రౌండ్స్ లో నిర్వహించిన భారి భహిరంగ సభకు 2 లక్షల మంది ప్రజలు హాజరయ్యారు.

                     1997 ఏప్రిల్ 6 న ఆయన పై పోలీసులు విరుచుకు పడ్డారు, ఆయన శరీరంలోకి అనేక బుల్లెట్లు గుచ్చుకున్నాయి, అన్ని బుల్లెట్ లను తొలగించారు కాని ఒక్క బుల్లెట్ ను మాత్రం డాక్టర్ లు తొలగించలేదు, అది తొలగిస్తే ఆయన ప్రాణాలకే ప్రమాదం, ఆయన ఒంట్లో ఇప్పటికి బుల్లెట్ ఉంది.
                      ఆ తర్వాత నక్సలైట్ పార్టీలో ఉంటూ విప్లవ సాహిత్యాన్ని ప్రజల ముందు ఉంచారు, విప్లవ రచయితల సంఘం ద్వార ప్రజలను చైతన్య పరుస్తున్నారు. 2002 లో ప్రభుత్వంతో చర్చల సమయంలో నక్సలైట్స్ గద్దర్, మరియు వరవర రావు లను తమ దూతలుగా పంపారు.నకిలీ ఎన్కౌంటర్ లను ఆయన తీవ్రం గా నిరసించారు.
            ఆయన రాసిన పాటల్లో "అమ్మ తెలంగాణమ" అనే పాట బహుల ప్రజాదరణ పొందింది. తెలంగాణా లోని అన్ని అంశాలను స్పృశిస్తూ సాగింది ఈ పాట, ఆయన రాసిన "నీ పాదం మీద పుట్టు మచ్చ నై చెల్లెమ్మ" అనే పాటకు ఉత్తమ గీతంగా నంది అవార్డు వచ్చింది అయితే ఆయన ఆ అవార్డ్ ను తిరస్కరించారు. ఇటివల ఆయన మరోసారి జై భోలో తెలంగాణా సినిమాలో తెరపైన కనిపించరు, పొడుస్తున్న పొద్దు మీద పాట ఆయనే రాసి పాడి, అభినయించారు, ఈ పాట అద్భుత విజయం సాధించింది, సినిమా నడిచినన్ని రోజులు థియేటర్ లలో జనం ఈ పాట రాగానే నృత్యాలు చేసారు.


            గద్దర్ మొదటి నుండి తెలంగాణా వాదే, మావోఇస్ట్ పార్టీ తెలంగాణా కు వ్యతిరేకంగా నిర్ణయం తీసుకున్నప్పుడు కూడా ఆయన తెలంగాణకే మద్దతు తెలిపారు, దేవేందర్ గౌడ్ నవ తెలంగాణా పార్టీ పెట్టి నప్పుడు ఆయనకు కూడా మద్దతు తెలిపారు గద్దర్, గద్దర్ పై దాడి జరిగినప్పుడు హోం మినిస్టర్ దేవేందర్ గౌడ్. 
ఆయన ప్రస్తుత ఉద్యమంలో తెలంగాణా ప్రజా ఫ్రంట్ ద్వార ముందకు వెళ్తున్నారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి