హోం

26, జనవరి 2012, గురువారం

తెలంగాణా మణిపూస నిజామాబాద్ జిల్లా..!


అక్షాంశాలు:రేఖాంశాలు:18.67278.094 నిజామాబాదు (Nizamabad) జిల్లా భారత దేశము లోని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రము యొక్క తెలంగాణ ప్రాంతము నందు ఉన్నది. నిజామాబాదు నగరము ఈ జిల్లా ముఖ్య పట్టణము. నిజామాబాదు ను పూర్వము ఇందూరు మరియు ఇంద్రపురి అని పిలిచేవారు. బోధన్, కామారెడ్డి, ఆర్మూరు ఇతర ప్రధాన నగరములు. నిజామాబాదు నగరం హైదరాబాదువరంగల్ తరువాత తెలంగాణాలో అతిపెద్ద నగరం.
చరిత్ర: నిజామాబాద్ ను 8వ శతాబ్దములొ రాష్ట్రకూట వంశానికి చెందిన ఇంద్రవల్లభ పాంత్యవర్ష ఇంద్ర సొముడనే రాజు పరిపాలించాడు. అతని పేరుపైననే ఈ ప్రాంతానికి ఇందూరు అని పేరు వచ్చినది. తరువాత 1905వ సంవత్సరములో ఈ ప్రాంతములో నుండి (సికింద్రాబాద్ నుండి మన్మాడ్ వరకు) రైలు మార్గము ఏర్పాటు చేసినప్పుడు ఇక్కడి ప్రాంతానికి అప్పటి రాజు నిజాం-ఉల్-ముల్క్పేరు పెట్టి,నిజామాబాద్ గా మార్చడం జరిగింది.
భోగోళిక వివరాలు:జిల్లాకు సరిహద్దులుగా, ఉత్తరాన అదిలాబాదు జిల్లా, తూర్పున కరీంనగర్, దక్షిణాన మెదక్ జిల్లాలు, పశ్చిమాన కర్ణాటక లోని బీదరు జిల్లా మరియు మహారాష్ట్ర లోని నాందేడ్ జిల్లాలు ఉన్నాయి. 18-5' మరియు 19' ఉత్తర అక్షాంశాల మధ్యా, 77-40' మరియు 78-37' తూర్పు రేఖాంశాల మధ్య జిల్లా విస్తిరించి ఉన్నది. సముద్రతీరానికి సుదూరంగా ఉండటంచేత జిల్లా వాతావరణం భూమధ్యరేఖా వాతావరణం గాను, విపరీత ఉష్ణోగ్రతా వ్యత్యాసాలు ఉంటాయి. సగటు కనిష్ట ఉష్ణోగ్రత 13.7'C, సగటు గరిష్ట ఉష్ణోగ్రత 39.9'C గాను ఉన్నాయి. శీతాకాలంలో ఉష్ణోగ్రత 5'C వరకు పడిపోవడం, వేసవిలో 47'C వరకు పెరగడం కూడా కద్దు. జిల్లా విస్తీర్ణం 7956 చ.కి.మీ, అనగా 19,80,586 ఎకరాలు. జిల్లాలోని 36 మండలాల్లో ఉన్న 923 గ్రామాల్లో 866 నివాసమున్నవి కాగా, 57 గ్రామాలు ఖాళీ చెయ్యబడినవి గానీ, లేక నీటిపారుదల ప్రాజెక్టులలో ముంపుకు గురయినవి గాని.
జిల్లా ఘనాంకాలు: 
జిల్లాకు చెందినా ప్రముఖులు:  
జిల్లా నుండి మేటి రాజఖీయ నాయకులు అనేకమంది ఉన్నారు, వీరిలో..
డి శ్రీనివాస్: PCC అధ్యక్షునిగా మూడు సార్లు పనిచేసారు.
సురేష్ రెడ్డి: గతంలో ఆంద్ర ప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ గా పనిచేసారు.

పోచారం శ్రీనివాస్ రెడ్డి: టి డీ పీ లో చాల సీనియర్ నేత, ఇటీవలే తెలంగాణా కోసం రాజీనామా చేసి టి ఆర్ ఎస్ లో చేరారు.
మధు యాష్కి గౌడ్: 2004 వ సంవత్సరం మొదటి సారిగా కాంగ్రెస్ తరపున పార్లమెంట్ కు ఎంపికయ్యారు, ఆయన రెండు సార్లు ఎం పి గా గెలిచారు, తెలంగాణా ఉద్యమంలో కూడా క్రియాశీలంగా పాల్గొంటున్నారు, సకల జనుల సమ్మె కాలంలో జరిగిన రైల్ రోకోలో పాల్గొన్నారు.
ఎండల లక్ష్మి నారాయణ: ఈయన బి జే పీ పార్టి తరపున అప్పటి పి సి సి చైర్మెన్ డి శ్రీనివాస్ పై గెలుపొందారు, 2010 లో తెలంగాణా కోసం రాజీనామా చేసారు, అయితే ఈయనను ఓడించాలని డి ఎస్ శత విధాల ప్రయత్నించి భంగపడ్డారు, ఈయన రెండవ సారి కూడా డి ఎస్ పై విజయం సాధించారు.
గడ్డం ఆనంద్ రెడ్డి: టి డి పీ సేనియర్ నాయకుడు, తర్వాత టి ఆర్ ఎస్ లో చేరి ఎం ఎల్ ఎ గా పనిచేసారు.
జింబో రాజేందర్: నిజామాబాదు జిల్లా జడ్జ్ గా పని చేసిన కాలంలో రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా తెలుగులోతీర్పుచెప్పారు, ఈయన స్వతహాగా రచయిత కూడా.
ప్రముఖ రచయిత డా.కేశవరెడ్డిరాయలసీమలో జన్మించిన ఈయన, జిల్లాలోని డిచ్‌పల్లి లో స్థిరపడి, పేదలకు ఉచిత వైద్య సేవలు అందిస్తున్నాడు.
సినిమాల్లో కూడా జిల్లా వారు ఈ మధ్యే ఎదుగుతున్నారు, నిర్మాత దిల్ రాజు(వెంకటరమణ రెడ్డి), హీరో నితిన్, డిస్ట్రిబ్యుటర్ నల్ల సుధాకర్ రెడ్డి మొదలైన వారు ఉన్నారు.
ముఖ్య పట్టణాలు: 
  1. కామారెడ్డీ
  2. బాన్స్వాడ
  3. ఆర్మూర్
  4. యెల్లారెడ్డి
  5. బొధన్
  6. భీమ్‌గల్
పర్యాటక ప్రదేశాలు:నిజాంసాగర్‌, శ్రీరాంసాగర్, పోచారం, ఆలీసాగర్, నిజామాబాదు కోట, డిచ్‌పల్లి రామాలయం, తిలక్ గార్డెన్ వద్ద ఉన్న మ్యూజియం, దోమకొండ కోట, కంటేశ్వర్ దేవాలయం, ఖిల్లా రామాలయం, మల్లారం అడవి, అశోక్ సాగర్, సారంగాపూర్, తెలంగాణ యూనివర్సిటీ, ఆర్మూరు రోడ్డు లోని శిలలు మొదలైనవి జిల్లాలోని కొన్ని పర్యాటక ఆకర్షణలు. నిజామాబాదు కోట, రఘునాథదాసు నిర్మించిన ఒకప్పటి రామాలయంపై నిర్మించారు. ఆయనే నిర్మించిన పెద్ద చెరువు నేటికీ నిజామాబాదు నగర మంచినీటి అవసరాలు తీరుస్తోంది. ఈ పర్యాటక ప్రదేశాలన్నీ అందమైన తోటలతో, అతిథిగృహాల వంటి సౌకర్యాలతో యాత్రికులకు సౌకర్యవంతంగా ఉన్నాయి.
పురాతత్వ ప్రదర్శనశాల
నిజామాబాదు లోని జిల్లా పురాతత్వ ప్రదర్శనశాలలో ప్పాతిరాతియుగం నుండి విజయనగర సామ్రాజ్య కాలం వరకు మానవ నాగరికత పురోగతిని తెలియజేసే పురాతన వస్తువులు ఉన్నాయి.2001 అక్టోబర్ లో ప్రారంభమైన ఈ ప్రదర్శనశాలలో పురాతత్వ విభగం, శిల్పకళా విభాగం, కాంస్య, అలంకరణ విభాగం అనే మూడు విభాగాలు ఉన్నాయి. బిద్రీ వస్తువులు మరియు అనేక రకములైన ఆయుధములు కూడా ప్రదర్శనలో ఉన్నాయి.
మల్లారం అడవి
మల్లారం అడవి నిజామాబాదు నుండి 7 కిలోమీటర్ల దూరములో ఉన్నది. చుట్టూ వన్య ప్రదేశములో ఒదిగిఉన్న మల్లారం ప్రకృతి పర్యటణకు సరైన స్థలము. అడవి మార్గములు, ఒక గోపురము మరియు ఒక దృశ్యకేంద్రమున్న టవర్ ఇక్కడి ముఖ్య ఆకర్షణలు. 1.45 బిలియన్ సంవత్సరాల పురాతనమైన శిల ఇక్కడ మిమ్మల్ని ప్రకృతి ఒడిలోకి పిలుస్తుంది. సాహసిక పర్యటనలకు మరియు ఉత్తేజితమైన పిక్నికులకు చాలా అనువైన ప్రదేశము.
అశోక్ సాగర్
అందమైన శిలలు మరియు ఉద్యానవనాలతో దృశ్యసౌందర్యమైనది అశోక్ సాగర్ చెరువు. హైదరాబాదు - బాసర రోడ్డులో నిజామాబాదు నుండి 7 కిలోమీటర్ల దూరములో ఉన్నది. ఇక్కడ ఉద్యానవనము చక్కగా తీర్చిద్దిబడి వెలిగించబడిన శిలలతో ఉన్నది. ఈ సరస్సులో పడవ విహారము కూడా చేయవచ్చు.
అలీసాగర్
అలీసాగర్ నిజామాబాదు నుండి 10 కిలోమీటర్ల దూరములో నిజామాబాదు - బాసర రోడ్డుకి 2 కిలోమీటర్ల దూరములో ఉన్నది. ఈ మానవ నిర్మిత జలాశయము 1930లొ కట్టబడినది. నగర జీవితము యొక్క హడావిడికి దూరముగా ఈ జలాశయము ప్రశాంత వాతావరణము కల్పిస్తుంది. వన్య ప్రాంతముతో పాటు కల వేసవి విడిది, చక్కగా తీర్చిదిద్దిన ఉద్యానవనాలు, ఒక దీవి మరియు కొండపైనున్న అతిధిగృహము దీనిని పర్యాటకులకు ఒక ముఖ్య గమ్యస్థానముగా చేస్తున్నాయి. వీటితో పాటు జింకల పార్కు, ట్రెక్కింగ్ మరియు జలక్రీడలకు సదుపాయాలు ఉండటము అదనపు ఆకర్షణ.
  • ఆర్మూరు రోడ్డు లోని శిలలు - ఆర్మూరు
  • దోమకొండ కోట - దోమకొండ
  • తెలంగాణ యూనివర్సిటీ - డిచ్‌పల్లి.
పుణ్య క్షేత్రాలు:జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలలో లింబాద్రి గుట్ట, బడా పహాడ్, బిచ్కుంద మరియు సారంగాపూర్ మొదలైనవి కలవు.
లింబాద్రి గుట్ట
లింబాద్రి గుట్టపై ప్రశాంత వాతావరణములో శ్రీ నరసింహ స్వామి ఆలయము నెలకొన్నది. ఈ ప్రదేశము భీంగళ్ నుండి 4 కిలోమీటర్ల దూరములో ఉన్నది. ప్రతి సంవత్సరము కార్తీక సుద్ధ తదియ నుండి త్రయోదశి వరకు ఇక్కడ ఉత్సవము జరుగును.
బడా పహాడ్
వర్ని మరియు చండూరు మధ్య ఉన్న బడా పహాడ్ పైన సయ్యద్ సదుల్లా హుస్సేనీ దర్గాలో అనేక మంది ప్రజలు శ్రద్ధాంజలి ఘటించడానికి వస్తారు. ఇక్కడ ప్రతి సంవత్సరము జాతర కూడా జరుగును.
బిచ్కుందబిచ్కుంద (లేదా బిచ్‌కుంద), ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని నిజామాబాదు జిల్లాకు చెందిన ఒక మండలము. ఏటా శివరాత్రి నాడు బిచ్కుంద బసవలింగప్పస్వామి గుడి వద్ద జరిగే తిరునాళ్ళకు ఆంధ్ర ప్రదేశ్ నుండే కాక, మహారాష్ట్రకర్ణాటక ల నుండి కూడా అశేషంగా భక్తులు వస్తారు
సారంగాపూర్
నిజామాబాదు నుండి 8 కి.మీ.ల దూరంలో ఉన్న సారంగాపూర్ వద్ద హనుమంతుని దేవాలయం ఉంది. ఛత్రపతి శివాజీ గురువైన సమర్థ రామదాసు, దాదాపు 452 ఏళ్ళ కిందట ఈ ఆలయానికి శంకుస్థాపన చేసాడు. చక్కటి రవాణా సౌకర్యాలతో, భక్తులకు అవసరమైన వసతి వంటి అన్ని సౌకర్యాలు ఈ ప్రదేశం కలిగిఉంది.

కంఠేశ్వర్
కంఠేశ్వర్ వద్ద ఉన్న నీలకంఠేశ్వరుని రూపంలో ఉన్న శివుని దేవాలయం పురాతనమైనది. ఉత్తర భారత వాస్తు శైలిలో ఉండే ఈ ఆలయాన్ని శాతవాహన చక్రవర్తి యైన రెండవ శాతకర్ణి జైనుల కొరకు కట్టించాడు. రథసప్తమి పండుగను ప్రతిఏటా పెద్దేత్తున జరుపుతారు.
ఖిల్లా డిచ్ పల్లి రామాలయం
క్రీ.శ. 1600 ప్రాంతంలో విజయనగర రాజులు డిచ్ పల్లి దేవాలయాన్ని నిర్మించినట్లు తెలుస్తోంది. 76 అడుగుల ఎత్తులో దీన్ని నిర్మించారు. ద్వారాలపై నగిషీ, గోపురాలపై ద్రావిడుల ప్రభావం కన్పిస్తుంది. విజయనగర రాజుల శిల్ప రీతి కనిపించడంతో 16వ శతాబ్దం మధ్య కాలంలో రామరాయల హయాంలో నిర్మించి ఉండొచ్చని భావిస్తున్నారు. నిర్మాణం మొత్తం చాలావరకు నల్లరాయితో జరిగింది. ఈ దేవాలయానికి ఎదురుగా చెరువు మధ్యలో నిర్మించిన మండపం ప్రత్యేక ఆకర్షణ.
ఖిల్లా రామాలయం
ఇందూరు, ఇంద్రపురి అనేపేర్లు కలిగిన నిజామాబాదు పట్టణాన్ని, ఇక్కడి కోటను రాష్ట్రకూటులు నిర్మించారు. వారి కాలంలోనే నిర్మించిన 40 అడుగుల ఎత్తున్న విజయస్థూపం కూడా ఇక్కడ ఉంది. క్రీ.శ. 1311లో ఈ కోటను అల్లావుద్దీన్ ఖిల్జీ ఆక్రమించాడు. తరువాత అది బహమనీ రాజుల చేతుల్లోకి, ఆపై కుతుబ్ షాహీ, ఆసఫ్ జాహీల చేతుల్లోకి వెళ్ళింది. విశాలమైన ఈ కోట రాతి గోడలతో, నాలుగు మూలల నురుజులతో ఉంది. క్రీ.శ.10 వ శతాబ్దపు ఈ రాష్ట్రకూటుల కోట ప్రస్తుతం ఆసఫ్ జాహీ ల శైలిలో విశాలమైన గదులతో ఉంది. కోటలో సమర్థ రామదాసునిర్మించిన బడా రామాలయం మరో ఆకర్షణ.
రాజరాజేశ్వరస్వామి దేవాలయము
భిక్కనూరు రాజరాజేశ్వరస్వామి దేవాలయము నిజామాబాదు నుండి 70 కిలోమీటర్ల దూరములో ఉన్నది.
క౦జర్ లొ కుడా హనుమ౦తుని దెవలయ౦ ఉన్నది ఆ గుడి ఛరిత్ర 1843 న నిర్మి౦ఛబడ్డది.
సంస్థానాలు:
జిల్లాలో చారిత్రక శిల్పసంపదకు కొదవలేదు. రాజులు ఏలిన సంస్థానాలలో నేటికీ చారిత్రక కట్టడాల ఆనవాళ్ళు దర్శనమిస్తున్నాయి. క్రీ.పూ.3000 నాటికే జిల్లాలో మానవుల ఉనికి ఆధారాలున్నాయి. అందుకు చరిత్రకారులకు దొరికిన 'కైరన్'(చనిపోయిన వారిని వారికి ఇష్టమైన వస్తువులతో కలిపి పూడ్చిపెట్టి దాని చుట్టూ కొన్ని గుర్తులను అమర్చడం)లే నిదర్శనం. దీని ద్వారానే ప్రాచీన కట్టడాలైన రాష్ట్ర కూటులు, బోధన్ చాళుక్య, కల్యాణి చాళుక్యులు, కాకతీయుల ఆలయాలు, ముస్లిం నిర్మాణాలు తెలిశాయి.
జిల్లాలోని సంస్థానాలు
రాజులకు సేవచేసిన కొందరికి అధిక మొత్తంలో భూమిని ధారాదత్తం చేసేవారు. అలా ఎక్కువ మొత్తంలో భూమి పొందిన వారినే సంస్థానాధీశులుగా పేరుపొందారు. సంస్థానాలు అంటే చాలామొత్తంలో ఎక్కువ గ్రామాలు అధికారి ఏలుబడి కింద ఉండడం. ముస్లిం రాజుల పరిపాలనలో అధికార భాషలుగా ఫారసీ,ఉర్దూ ఉండేవి. జిల్లాలో దోమకొండ, సిర్నాపల్లి, కౌలాస్ సంస్థానాల ఆనవాళ్ళు నేటికీ పదిలం.
కౌలాస్
కాకతీయ సామ్రాజ్యం అంతమైన తరువాత బహమనీ సుల్తానులు కౌలస్ దుర్గాన్ని వశపరచుకున్నారు. ఈ సంస్థానానికి ఔరంగజేబు ద్వారా రాజా పథంసింగ్ గౌర్ ను కౌలాస్ సంస్థానాధీశునిగా నియమితులయ్యారు. ఇతని వారసులు స్వాతంత్ర్యం వరకు అసఫ్ జాహి నైజాం రాజులకు సామంతులుగా వారి రాజ్య పరిరక్షణలో ముఖ్యపాత్ర పోషించారు. రాజా దీప్ సింగ్ 1857 తిరుగుబాటులో ముఖ్యపాత్ర పోషించి బ్రిటీషువారిచే శిక్షకు గురయ్యాడు. శత్రు దుర్భేద్యమైన అప్పటి కట్టడాలు ఇప్పటికీ వాటి నిర్మాణ చాతుర్యాన్ని చాటుతున్నాయి.
సిర్నాపల్లి సంస్థానం
జిల్లాలో సిర్నాపల్లి సంస్థానానికి ప్రత్యేకత ఉంది. నిజాం నవాబు కాలంలో రాణి జానకీబాయి హయాంలో జరిగిన అభివృద్ధి పనులు ఇప్పటికీ అజరామరం. 1859 నుంచి 1920 వరకు సిర్నాపల్లి సంస్థానాన్ని ఆమె పాలించారు. చెరువులు, ఆనకట్టలు, కుంటలు, బావులు, కాలువలు కట్టించారు. ఆమె ఇందల్ వాయి, నిజామాబాద్ లోని సిర్నాపల్లి గడి, కోటగల్లిగడి, మహబూబ్ గంజ్ లోని క్లాక్ టవర్ కట్టడం తదితర నిర్మాణాలు, జానకంపేట, నవీపేట, రెంజల్ దాకా 100 గ్రామాల్లో పరిపాలన సాగించారు. సికింద్రాబాద్-నిజామాబాద్ రైల్వేలైనును నిజాం నవాబు ఉప్పల్ వాయి, డిచ్ పల్లిల మీదుగా వేస్తే, ఈమె ఆ లైనును తన సిర్నాపల్లి మీదుగా వెళ్ళేలా వేయించుకున్నారు.
వెల్మల్ సంస్థానం
జిల్లాలో వెల్మల్ సంస్థానం పురాతనమైనది. దీని క్రింద వెల్మల్, కల్లెడి, గుత్ప తదితర గ్రామాలుండేవి.

దోమకొండ సంస్థానం
ప్రాచీన సంస్థానాల్లో పేరెన్నికగన్నది దోమకొండ. పాకనాటి రెడ్డశాఖకు చెందిన కామినేని వంశస్థులు ఈ సంస్థానాధీశులు. 1636లో అబ్దుల్ హుస్సేన్ కుతుబ్ షాహి కామారెడ్డికి ఈ సంస్థానాన్ని ఇచ్చాడు. ఈ ప్రాంతంలోని అనేక గ్రామాలు వారి వంశీయుల పేర్లయిన కామారెడ్డి, సంగారెడ్డి, ఎల్లారెడ్డి, మాచారెడ్డి, సదాశివనగర్, పద్మాజివాడి, తుక్కోజివాడి, తిమ్మోజివాడిల మీదనే వెలిశాయి. సంస్థానంలోని కట్టడాలు శిల్పకళా సంపదను సాక్షాత్కరిస్తాయి. కోట, అద్దాల బంగళా, రాజుగారి భనాలు, అశ్వగజ శాలలు, కుడ్యాలు, బురుజులు, కందజం పర్యాటకులకు ప్రధాన ఆకర్షణ. ఈ అద్దాల మేడలోనే కామినేని వంశీయులు సాంస్కృతిక కార్యక్రమాలు జరిపించేవారు. పురావస్తుశాఖ ఆధ్వర్యంలో పునర్నిర్మాణ పనులు జరగడంతో చారిత్రక సంపదను కాపాడుకున్నట్లయింది.
నిజామాబాదులోని మండలాలు:
భౌగోళికంగా నిజామాబాదు జిల్లాను 36 రెవిన్యూ మండలాలుగా విభజించినారు.
13.యెడపల్లె
25.సదాశివనగర్


బోధన షుగర్ ఫ్యాక్టరీ: ఇది ఆసిఅలోనే అతి పెద్ద చెక్కెర కర్మాగారాల్లో ఒకటి, నిజామాబాదు జిల్లా భోధన్ ప్రాంతంలో నిజాం రాజు కాలంలో స్థాపించిన ఫ్యాక్టరీ ఈ నిజాం షుగర్ ఫ్యాక్టరీ, ఇది భారత దేశంలోనే అతిపెద్ద చెక్కెర కర్మాగారం, టి డీ పీ అధికారంలోకి వచ్చే వరకు ఇది మంచి లాభాల్లో ఉంది, టి డి పీ అధికారంలోకి రాగానే ఈ ఫ్యాక్టరీ లాభాన్ని ఆంధ్రలో నష్టాల్లో ఉన్న కంపనిలకు తరలించి దీన్ని నష్టాల ఆట పట్టించారు, చివరికి నష్టాల్లో ఉన్న ఈ కంపనీని భరించలేమని ఒక ప్రవేట్ సంస్థకు అమ్మేసారు.


శ్రీరామ్ సాగర్ : గోదావరి నదిపై నిజామాబాదు జిల్లా బాల్కొండ మండలములో శ్రీరాంసాగర్ ప్రాజెక్టు కలదు. దీని పూర్వపు పేరు పోచంపాడు ప్రాజెక్టు. గోదావరినదిపై ఆంధ్ర ప్రదేశ్ లో ఇది మొట్టమొదటి ప్రాజెక్టు. మహారాష్ట్రలోని జైక్వాడి ప్రాజెక్టు తరవాత గోదావరి నదిపై దీనిని నిర్మించారు.

రామగుండం థర్మల్ విద్యుత్ కేంద్రానికి నీరు సరఫరా చేసే ప్రాజెక్టు ఇది. దీనికి కాకతీయ కాల్వ, సరస్వతి కాల్వ , లక్ష్మీ కాల్వ అనే మూడు కాల్వలు కలవు. 1963 లో నిర్మించిన ఈ ప్రాజెక్టు ప్రారంభంలో కేవలం నీటిని నిల్వచేసి నీటిపారుదలకు ఉపయోగపడే జలాశయం గానే ఉండేది. 1983 తర్వాత నందమూరి తారక రామారావు ప్రభుత్వ హయంలో ఈ ప్రాజెక్టును విస్తరించి జల విద్యుత్ఉత్పాదన సంస్థగా అభివృద్ధి చేశారు.
శ్రీరాంసాగర్ ప్రాజెక్టు జిల్లా కేంద్రమైన నిజామాబాదు నుండి 60 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇది 7 వ నెంబరు జాతీయ రహదారి నుండి 5 కిలోమీటర్లు లోనికి ఉంది. ఆదిలాబాదు జిల్లానిర్మల్ పట్టణం నుండి దీని దూరం 20 కిలోమీటర్లు. ఈ ప్రాజెక్టు 18°58' ఉత్తర అక్షాంశం, 78°19' తూర్పు రేఖాంశం పై ఉంది.శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ను 1963 లో అప్పటి భారత ప్రధాన మంత్రి జవహర్ లాల్ నెహ్రూ ప్రారంభించారు. ప్రారంభంలో ఇది కేవలం నీటిపారుదల ప్రాజెక్టుగానే సేవలందించగా, రెండు దశబ్దాల అనంతరం నందమూరి తారక రామారావు ముఖ్యమంత్రి హయాంలో ఈ ప్రాజెక్టు విద్యుదుత్పాదన ప్రాజెక్టుగా అవతరించింది.

  • శ్రీరాంసాగర్ జలాశయపు నీటిమట్టం గరిష్ట ఎత్తు 1091 అడుగులు,
  • జలాశయ నీటి నిల్వ సామర్థ్యం 90 శత కోటి ఘనపుటడుగులు
  • ఈ ప్రాజెక్టునకు మొత్తం 42 వరద గేట్లు కలవు.
  • ఈ ప్రాజెక్టు నుంచి నీటి సరఫరాఆయె కాలువలు: కాకతీయ కాల్వ, సరస్వతి కాల్వ, లక్ష్మి కాల్వ, వరద కాల్వ.
  • విద్యుదుత్పత్తి సామర్ద్యం 27  మెగావాట్లు, మూడు టర్బయిన్‌ల సహాయంతో కాకతీయ కాలువకు నీటి విడుదలచేస్తారు.
కామారెడ్డి ఎత్తిపోతల పథకం:నిజామాబాదు జిల్లా కామారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని 83 గ్రామాలకు తాగునీటిని అందించడానికి శ్రీ రాంసాగర్ ప్రాజెక్టు నుంచి ఎత్తిపోతల పథకం ద్వారా అందించడానికి రూ. 140 కోట్లతో ఒక పథకాన్ని చేపట్టనున్నారు. దీని ద్వారా కామారెడ్డితాడ్వాయిసదాశివ నగర్దోమకొండబిక్నూరుమాచారెడ్డి మండలాలకు తాగునీటు అందుతుంది. ఈ పథకం పూర్తి కావడానికి సుమారు 520 కిలో మీటర్ల పైప్ లైన్ వేయాల్సి ఉంటుంది. దీని ద్వారా సుమారు 5 లక్షల మందికి తాగునీరు లభిస్తుంది.

రవాణా సౌకర్యాలు: సికింద్రాబాద్ నుండి మన్మాడ్ రైల్ మార్గంలో నిజామాబాదు ఉంది, షిరిడి, బాసర వంటి పుణ్య క్షేత్రాలకు ఇక్కడినుండే రైళ్ళు వెళ్తాయి, అలాగే నిజామాబాదు నుండి కర్ణాటక రైల్ మార్గం కూడా అభివృద్ది చేసారు, కరీంనగర్ నిజామాబాదు రైల్ మార్గం పనులు అనుకున్నంత వేగంగా జరగడం లేదు. అంతే కాకుండా విద్యుత్ సౌకర్యం లేదు.
నిజామాబాదు నుండి తెలంగాణా లోని అన్ని జిల్లాలకు బస్ సర్వీసులు ఉన్నాయి, అంతే కాకుండా కర్ణాటక, మహారాష్ట్ర లకు కూడా ఇక్కడినుండి బస్సులు కలవు.
NH -7 , NH - 16 లు జిల్లా గుండా వెళ్తున్నాయి.

అంకాపూర్: అంకాపూర్ ఆర్మూర్ మండలంలోని ఒక చిన్న గ్రామం, ఈ గ్రామ జనాభా (2011 ) జనాభా లెక్కల ప్రకారం 8066  
ఇది ఒక మోడల్ గ్రామంగా గుర్తింపు పొందింది, గ్రామంలోని ప్రజలంతా వ్యవసాయదారులే, వీరంతా ఆధునిక వ్యవసాయ పద్ధతులను అనుసరించి విజయం సాధించారు, ఈ గ్రామంలో ప్రతి ఇల్లు పట్టణాలలో కనిపించే పెద్ద పెద్ద భవనలను పోలి ఉంటాయి, ప్రతి ఇంట్లోను కార్లు సాధారణ విషయమే, ఇదంతా ఎలా సాధ్యమయ్యిన్దంటే గ్రామస్తులంతా కలిసి సంఘటితంగా  సాధించిన విజయం, ఆధునిక సస్య రక్షణ పద్ధతులు పాటిస్తూ, పంట దిగుబడిని పెంచుకోవడం, అంతే కాకుండా, వాణిజ్య పంటలను ఎంచుకొని విజయం సాధించారు ఇక్కడి రైతులు, అందుకే ICRISAT ఈ గ్రామాన్ని మోడల్ గ్రామంగా గుర్తించింది.ఈ గ్రామస్తులు ప్రధానంగా పసుపు, జొన్నలు, రాగులు, మక్కలు పండిస్తారు.
 IRRI, ICRISAT, CRIDA, ICAR, వంటి ఎన్నో అంతర్జాతీయ సంస్థలు ఈ గ్రామాన్ని మోడల్ గ్రామంగా గుర్తించాయి.
* రాష్ట్ర ప్రభుత్వం ఉత్తమ, ఆదర్శ గ్రామంగా గుర్తించింది.
* జిల్లలో ప్రధానం గా పండే పంటలు చెరకు, పసుపు, రాగులు, జొన్నలు, మక్కలు.
తెలంగాణా విశ్వవిద్యాలయం: రాజశేకర్ రెడ్డి హయంలో రాష్ట్ర ప్రభుత్వం 2006 వ సంవత్సరం ఈ విశ్వవిద్యాలయాన్ని స్థాపించింది, తెలంగాణా లో మూడవ విశ్వవిద్యాలయం ఈ తెలంగాణా విశ్వా విద్యాలయం.

ఉద్యమంలో నిజామాబాదు: కోటి రతనాల వీణ నా తెలంగాణ అంటూ దాశరథి ఎలుగెత్తి చాటింది నిజామాబాద్ లోని ఖిల్లా జైలులో. తెలంగాణ స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొన్న రాజకీయ ఖైదీలను ఇక్కడి ఖిల్లా జైలులోనే నిర్భంధించేవారు. అందుకే దాన్ని 'సియాసీయోంకా ఖబరస్థాన్'(రాజకీయ ఖైదీల బొందలగడ్డ)గా అభివర్ణించేవారు. 1947లో భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పటికీ నిజాం రాజు ఆధీనంలోని హైదరాబాద్ రాష్ట్రానికి మాత్రం స్వాతంత్ర్యం రాలేదు. నిజాం భారతదేశంలో తన రాష్ట్రాన్ని విలీనం చేయడానికి ససేమిరా అన్నాడు. ఫలితంగా తెలంగాణ ప్రాంతం విమోచన కోసం ఉద్యమాలు జరిగాయి. అందులో జిల్లా పాత్ర ఎనలేనిది.
స్వాతంత్ర్యం వచ్చిన తరువాత 13 నెలలపాటు తెలంగాణ ప్రాంత వాసులపై నిజాం క్రూరమైన అణచివేతను అమలు చేశాడు. ఆయన్ను వ్యతిరేకించిన వారినందరినీ ఖిల్లా జైలులో నిర్బంధించాడు. నిజాం ఆధ్వర్యంలోని రజాకర్లు చేసిన అత్యాచారాలు అన్నీ ఇన్నీ కావు. వాటినన్నిటిని ఓర్చుకుని తెలంగాణ విముక్తి కోసం పాటుపడిన వారు జిల్లాలో ఎక్కువ సంఖ్యలో ఉన్నారు.
విముక్తిబాటలో ముఖ్య ఘట్టాలు:
  • నిజాంకు వ్యతిరేకంగా 1937లో నిజామాబాద్ లోని కంఠేశ్వర్ లో ఆరో ఆంధ్ర మహాసభ జరిగింది.
  • 1939 జనవరి 30న జరిగిన హైదరాబాద్ నిరసన దినం నిజామాబాద్ లోనూ నిర్వహించారు.
  • నిజాం రజాకర్లను వ్యతిరేకించడంలో జిల్లా ఆర్యసమాజ్ పాత్ర ఎనలేనిది. దీని విస్తృతి రజాకార్లకు మింగుడుపడ లేదు. 1939లో రాధాకృష్ణ అనే ఆర్యసమాజ్ కార్యకర్తను(ఇప్పటి గాంధిచౌక్) పోలీసు స్టేషన్ ఎదుటే కత్తులతో పొడిచి చంపారు.
  • జిల్లాలో ఆర్యసమాజ్, హైదరాబాద్ రాష్ట్ర కాంగ్రెస్, కమ్యూనిస్టుల ఆధ్వర్యంలో పోరాటాలు జరిగాయి.
  • కామారెడ్డి, ఆర్మూర్, భిక్కనూరు ప్రాంతాల్లో ఆంధ్ర మహాసభ ఆధ్వర్యంలో నిజామాబాద్, బోధన్ పరిసర ప్రాంతాలలో ఆర్యసమాజ్, నిజామాబాద్, బాల్కొండ ప్రాంతాలలో హైదరాబాద్ రాష్ట్ర కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిజాం వ్యతిరేక ఉద్యమాలు జరిగాయి.
  • 1943లో నిజామాబాద్ లో గణపతి కాశీనాథశాస్త్రి ఆధ్వర్యంలో జరిగిన ఆర్యసమాజ్ మహాసభలో తెలంగాణలో బాధ్యతాయుతమైన ప్రభుత్వ స్థాపన జరగాలని తీర్మానించారు.
  • కామారెడ్డి తాలూకాలోని అటవీ గ్రామాల్లో మంచిప్ప, బాన్సువాడ ప్రాంతాల్లో దళాలు తమ కార్యకలాపాలను సాగించాయి.
  • హైదరాబాద్ రాష్ట్ర కాంగ్రెస్ ను నిషేధిస్తున్నట్లు నిజాం ప్రకటించడంతో నిరసనలు మిన్నుముట్టాయి.
  • సత్యాగ్రహమే ఆయుధంగా వేలమంది విద్యార్థులు జిల్లా కేంద్రంలోజాతీయ త్రివర్ణ పతాకాన్ని చేబూని నిజాం వ్యతిరేక నినాదాలు చేస్తూ ప్రదర్శన జరిపారు. నిజాం ప్రభుత్వం దాదాపు 150 మందికి పి.డి. చట్టం ప్రయోగించి జైలుపాలు చేసింది.
  • ప్రస్తుత ఉద్యమంలో కూడా జిల్లా చురుకైన పాత్ర పోషిస్తుంది, జిల్లా లోని తెలంగాణా విశ్వ విద్యాలయం ఉద్యమానికి కేంద్రంగా ఉంది. తెలంగాణా కోసం రాజీనామా చేసిన బాన్సువాడ ఎం ఎల్ ఎ పోచారం శ్రీనివాస్ రెడ్డి భారి మెజారిటి తో గెలిపించి తెలంగాణా సత్తాను మరోసారి ప్రపంచానికి చాటారు నిజామాబాదు ప్రజలు...

2006 వ సంవత్సరానికి జిల్లా ఏర్పడి వంద సంవత్సరాలు పూర్తి అయ్యాయి. శతవసంతాల జిల్లా ఉత్సవాలను ప్రభుత్వం నిర్వహించింది.

2 కామెంట్‌లు: