హోం

16, ఏప్రిల్ 2013, మంగళవారం

సిర్ఫ్ హమారా-ఇరానీ చాయ్..!

 
పాశ్చాత్య దేశాల్లో అతిథికి వైన్‌తో స్వాగతం పలుకుతారు. మన దేశంలో అయితే ‘టీ’తో స్వాగతం పలుకుతాం. అదే మన హైదరాబాద్‌లో అయితే ‘ఇరానీ చాయ్’తో ప్రేమను పంచుతాం.
కేఫ్‌లు ఎన్నున్నా ‘ఇరానీ కేఫ్’లకు ఉన్న ప్రత్యేకత అంతా ఇంతా కాదు. 
నిజానికి ఇరానీ చాయ్‌కున్న ప్రత్యేకత దాని రంగు, రుచి, వాసనే..!
హైదరాబాద్ చాయ్ అలియాస్ ఇరానీ చాయ్...నగరంలో చార్మినార్‌ను ఎంతగా ఇష్టపడతారో ఇరానీ చాయ్‌ని కూడా చాలామంది అంతగా ఇష్టపడతారు. ఇరానీ చాయ్ లేని హైదరాబాద్ నగరాన్ని ఊహించలేం. 

           హైదరాబాద్‌లో మీనార్స్, బిల్డింగ్స్, టూంబ్స్, డోమ్స్, ఫ్యాలెస్‌లు, ఫీరల్స్, హాలీమ్, ఆర్చ్‌లు, షెర్వాణీ, బిర్యానీ, నవాబ్స్, కబాబ్స్ వంటి వాటితో పాటు ధీటుగా ఇరానీ చాయ్ కూడా తనదైన ప్రత్యేకతను సొంతం చేసుకుంది. నగరంలో చిన్నవి, పెద్దవి, మధ్యతరగతివి అన్నీ కలిపి సుమారు 25,000 వరకు కేఫ్‌లు ఉన్నాయి. ప్రతీ గల్లీలో టీ స్టాల్ కనిపిస్తుంది. మొత్తం మీద కొన్ని వందల సంఖ్యలోనైనా ఇరానీ కేఫ్‌లుంటాయి.
            ప్రతి రోజు ప్రతీ వ్యక్తి ఒక్కసారైన టీ తాగకుండా ఉండలేరు. పనిపాటలతో ఆలసిపోయే సగటు హైదరాబాదీకి రిలాక్స్ నిచ్చేది సింగిల్ కప్ టీనే. జంట నగరాల్లో ఎల్లప్పుడు తమ కుటుంబసభ్యునిలా, అతిథిలా ఆహ్వానించడానికి సిద్ధంగా ఉంటుంది ఇరానీ చాయ్. పాశ్చాత్య దేశాల్లో అతిథికి వైన్‌తో స్వాగతం పలుకుతారు. అదే మన దేశంలో అయితే టీ తో స్వాగతం పలుకుతాం. చాలా సందర్భాల్లోనూ ఓ కప్పు టీ తప్పకుండా ఉంటుంది. అంతెందుకు, ఇద్దరు మిత్రులు అనుకోకుండా కలిసారంటే దగ్గర్లో ఉన్న టీ స్టాల్కు వెళ్లాల్సిందే. తలనొప్పి వచ్చినా టీ తాగాల్సిందే. టీ తాగితే వెంటనే రిలీఫ్ అనిపిస్తుంది. దీనికి కారణం టీలోఉండే కెఫెన్, టానిన్‌లు వంటివి. అందుకే, చైనాలో క్రీ.పూ.3వ శతాబ్దంలో టీని తలనొప్పి తగ్గించే ‘మెడికల్ టానిక్’గా వాడేవారట.

Iranichai1జంటనగరాల్లోనూ చాలామంది చాయ్‌కి బానిసలయ్యారనడంలో సందేహం లేదు. అందులోనూ ఇరానీచాయ్ తాగకుండా అనేకులు తమ దైనందిన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టరంటే అతిశయోక్తికాదు. అంతెందుకు, టీ తాగనిదే ‘రెండువేళ్ల సమస్య’ పరిష్కారం కాని వాళ్లూ ఎందరో. అందుకే, టీ ‘జాతీయ ద్రవం’ అన్నా ఆశ్చర్యపోనక్కరలేదు. భారతదేశం మొత్తంలో చూస్తే అత్యధిక టీ స్టాల్లు హైదరాబాద్, సికిందరాబాద్ జంటనగరాల్లోనే ఉన్నాయన్నది ఆశ్చర్యకరమైన విషయం. 

        తనకంటూ ఓ ప్రత్యేకతను నిలబెట్టుకున్న ఇరానీ చాయ్ ఎప్పుడు, ఎలా పుట్టిందన్న దానికి సరైన ఆధారాలు లేనప్పటికీ బ్రిటీష్ వారు హైదరాబాద్‌కు వచ్చాకైతే మరింత ఎక్కువ పాపులర్ అయ్యిందని చెబుతారు. వాస్తవానికి ఇరానీ చాయ్ బ్రిటీష్‌వారు ఇక్కడికి రాకముందే ఉన్నప్పటికీ అది నగరాన్ని దాటి వెళ్లలేదన్నది నిజం. బ్రిటీష్ వారు వచ్చాకే ఇరానీ చాయ్‌కి అంతటి ప్రాచుర్యం లభించిందనేది కూడా ఒక వాస్తవమే. ఒకప్పుడు పెద్ద పెద్ద హోటల్స్, కేఫ్‌లకే పరిమితమైన ఇరానీ చాయ్ ఇప్పుడు గల్లీ గల్లీకి విస్తరించింది. నగరం విస్తరించినా , జనాభా పెరిగినా, సంస్కృతిలో ఎన్ని మార్పులొచ్చినా ఇప్పటికీ తన రంగు, రుచి, వాసనలో ఎలాంటి మార్పు లేనిది ఇరానీ చాయ్ మాత్రమే. అందుకే దానికంతటి ప్రజాదరణ!
          కమ్మటి రుచికరమైన ఇరానీ టీ ఎక్కడ దొరుకుతుందంటే చాలామంది షాలీబండలోని ‘షా గౌస్ రెస్టాంట్ లో’ అంటారు. ఆ తరువాత మక్కా మసీద్ సమీపంలోని ‘ఫరాషా ఇరానీ కేఫ్’, మస్లీ కమాన్ దగ్గరి షార హ కేఫ్‌ను చెప్పుకుంటారు. ఇవన్నీ చాలా ఏళ్ల నుండి ఇరానీ చాయ్ స్పెషల్ హోటళ్లుగా ముద్రపడ్డవే.             అఫ్జల్‌గంజ్ మసీదుకు ఎదురుగా మనకు మరో ఇరానీ హోటల్ కనిపిస్తుంది. అదే ‘న్యూ గ్రాండ్ హోటల్’. దీని యాజమాని జలీల్ ఫర్‌క్షికోజ్. ‘మా పూర్వీకులు ఇరాన్‌లోని యాజ్ద్‌లో ఉండేవారు. వారు అక్కడి నుండి మొదట ముంబాయి, తర్వాత పుణేకు వచ్చారు. ఆ తరువాత హైదరాబాద్‌లో కాలు మోపారు’ అన్నారు. న్యూ గ్రాండ్ హోటల్ జంటనగరాల్లో తొట్టతొలి ఇరానీ కేఫ్. దీన్ని 1936లో ప్రారంభించారు. ‘హైదరాబాదీలు ఇరానీ చాయ్‌ని ఇష్టపడతారు. అది ధనవంతులైనా, పేదవారైనా’ అంటాడు ఫర్‌క్షికోజ్. అంతేకాదు ‘ఇరానీ చాయ్ హైదరాబాద్ సంస్కృతిలో ఒక భాగమైపొయిందని’ కూడా అంటాడు. ఈ మాట అక్షర సత్యం!

‘ఇరాన్‌లో తేయాకు ఆకులు, నీరు, చక్కెర తప్ప పాలు లేకుండానే చాయ్ తయారు చేస్తారు. దాన్ని కొంచెం తాగితే ఆ మజానే వేరు. అయితే, ఇరాన్‌లో సెటిలైన పర్షియన్లు మాత్రం చాయ్ అంటే పాలు కూడా కలపమనే వారు. అలా, అన్ని రకాల మిశ్రమాల కలయికతో ప్రస్తుతమున్న ఇరానీ చాయ్‌కి చక్కని రంగు, రుచి, వాసన వచ్చింది’ అని జలీల్ ఫర్‌కోజ్ అంటాడు.

బంజారాహిల్స్ రోడ్ నెం. 11లో ‘సర్వీ కేప్’ పేరుతో ఒక ఇరానీ కేఫ్ ఉండేది. ‘సర్వీ అంటే పార్శిలో గ్రీనరీ అని అర్థం’ అంటాడు ఈ హోటల్ యాజమాని మిర్జా ఆలీ సర్వీ. ‘మేం ఈ కేఫ్ పెట్టి 25 సంవత్సరాలవుతోంది. మాకు నగరంలో మూడు బ్రాంచీలున్నాయి. ఇరానీ చాయ్ అనేది సగటు మనిషి జీవితంలో ఒక భాగమైంది’ అని కూడా అన్నాడు. 200 సంవత్సరాలకు పైగా చరిత్ర గల నగరం సికింవూదాబాద్. సికింవూదాబాద్ అనగానే గుర్తుకు వచ్చేది క్లాక్ టవర్. ఆ క్లాక్ టవర్‌కు దగ్గర్లో ఉన్న సరోజినిదేవి రోడ్‌లో ఉన్న మరో కేఫ్ ‘గ్డాన్ రెస్టాంట్’. దీన్ని 1952లో ఏర్పాటు చేశారు. సికింవూదాబాద్‌లోని ఆల్ఫా హోటల్ కూడా ఇరానీ చాయ్‌కి ప్రసిద్ది.

భారతదేశాన్ని ఆక్రమించిన తరువాత ఉత్తర భారతంలో బ్రిటీష్‌వారు తేయాకు తోటల మీదా తమ ఆధిపత్యాన్ని కొనసాగించారు. ముఖ్యంగా ఆస్సాంలో అప్పుడు తేయాకు అధికంగా పండేది. దీంతో అక్కడ ప్రతి సంవత్సరం మరింత నాణ్యమైన తేయాకును పండించేలా చర్యలు తీసుకునేవారు. నాణ్యత లేకుంటే తరువాత సంవత్సరం విత్తనాలను మార్చేవారు. అలా నాణ్యమైన తేయాకు పండించడం, దాన్ని తమ దేశానికి తరలించడం వంటి కారణాల వల్ల చాలాకాలం వరకు అస్సాం టీ మనకు అందని ద్రాక్షగానే మిగిలిపోయింది. బ్రిటీష్ వారు హైదరాబాద్‌లో అడుగుపెట్టాక ఇరానీ చాయ్‌లోని కమ్మదనాన్ని తమ సొంతం చేసుకోవాలనే ప్రయత్నం చేశారు. ఇరానీ చాయ్‌ని మించిన రుచిగల చాయ్‌ని మనదేశానికి పరిచయం చేయాలనే కోరిక వారిలో బలంగా ఉండేది. దానికోసం నాణ్యమైన తేయాకును పండించేలా తేయాకు రైతులమీద ఒత్తిడి తెచ్చేవారు. కానీ, ఇరానీ చాయ్ ముందు తెల్లవాడి ప్రయత్నాలు ‘చక్కెర లేని చేదు చాయ్’గానే మిగిలాయి.

నాణ్యమైన తేయాకు పొడి, పాలు తగిన మోతాదులో కలిపితేనే ఇరానీ చాయ్‌కి గొప్ప రుచి వస్తుందన్న వాస్తవాన్ని గ్రహించకపోవడం వల్లే బ్రిటీష్‌వారు తమ ప్రయత్నాలలో విఫలమయ్యారన్నది వాస్తవం. ఇక్కడ మరో విషయం కూడా చెప్పుకోవాలి. బ్రిటీష్‌వారు మన దేశ సంపదను కొల్లగొట్టి తీసుకెళ్లగలిగినప్పటికీ ఇరానీ చాయ్ రుచిని మాత్రం తమ సొంతం చేసుకోలేకపోయారు. 

ఇరాన్ నుండి హైదరాబాద్‌కు...
హైదరాబాద్ పుట్టుకకు ఇరానీ చాయ్‌కి విడదీయరాని అనుబంధం ఉంది. తేనీరు ప్రపంచమంతా విస్తరిస్తున్న సమయంలోనే హైదరాబాద్ ప్రాంతాన్ని కుతుబ్ షాహీలు గోల్కొండ రాజధానిగా పాలిస్తున్నారు. వీరు ఇరాన్ నుండి వచ్చి ఇక్కడ స్థిరపడ్డారు. రాజులతో పాటు వారి పరివారం కూడా పెద్ద సంఖ్యలో ఇక్కడికి వచ్చి స్థిరపడింది. వీరంతా క్రీ.శ 1591లో హైదరాబాద్ నగరానికి వచ్చారు. వారితోపాటు వారి అలవాట్లు, సంస్కృతి, సంప్రదాయాలను కూడా తీసుకువచ్చారు. వీరంతా కుతుబ్ షాహీలలో శక్తివంతులుగా, ప్రధానమైన వివిధ పరిపాలనా విభాగాల్లో నియమితులయ్యారు. వారు అనేక విద్య, మత సంబంధ సంస్థలు, భవనాలు నిర్మించారు. మసీదులు, అందమైన గార్డెన్‌లు కూడా ఏర్పాటు చేశారు. చార్మినార్, టూంబ్స్ తదితర నిర్మాణాల్లో మనకు ఇరానీ శైలి కనపడడానికి కారణం అదే. అందులో భాగంగా తమ ‘జాతీయ ద్రవం’ అయిన టీని కూడా వారే పరిచయం చేశారు. అలా మొదలైన టీ సంస్కృతి విస్తారంగా విస్తరించింది.

ఇరానీలు మన వాళ్ళకు పరిచయం చేసిన ద్రవం కనుక అది ‘ఇరానీ టీ’ అయ్యింది. 16వ శతాబ్దంలో స్థానికంగానే ఇరానీలు గ్రీన్, బ్లాక్ టీలను కనుగొన్నారు. 1840 తర్వాతే ఇరానీ చాయ్ దేశంలోని ఇతర ప్రాంతాలకు విస్తరించింది. ఇక మన దేశంలో అస్సాం టీ ఉత్తర భారతాన్ని తన సొంత గడ్డగా మలచుకుని దేశమంతా విస్తరించింది. 

ఇరానీ చాయ్ ‘సిర్ఫ్ హమారా’!
కుతుబ్ షాహీలు ఇక్కడ స్థిరపడిన తర్వాత చాలాకాలం వరకు ఇరానీచాయ్ సామాన్యులకు చేరలేదనే చెప్పాలి. బ్రిటీష్ వారు మన దేశానికి వచ్చిన తర్వాత కుతుబ్ షాహీలు ఇచ్చే విందుల్లో మాత్రమే బ్రిటీష్‌వారికి ఆ రుచి తెలిసింది. దానికి అలవాటు పడ్డ కొంతమంది బ్రిటీష్‌వారి కోసం, ఇరానీ చాయ్ అంటే ఇష్టపడే హైదరాబాదీల కోసం ప్రత్యేకంగా ఇరానీ కేఫ్‌లు పుట్టుకొచ్చాయి. ఇరానీ చాయ్‌లో మరో రకమైన బ్లాక్, గ్రీన్ టీలను హైదరాబాద్‌లో స్థిరపడ్డ ఇరానీయన్లు ఇక్కడే కనుగొన్నారు. ఆ రుచి గత తేనీటితో పోలిస్తే భిన్నంగా ఉండడంతో పాటు ఇరానీ హోటల్స్‌లో లభించేది కనుక ఆ చాయ్‌లను ‘ఇరానీ చాయ్’ అని పిలవడం మొదలుపెట్టారు. అందుకే, జంట నగరాల్లో లభించే ఇరానీ చాయ్‌తో పోలిస్తే ఇతర ప్రాంతాల్లో లభించే సాధారణ టీ చాలా భిన్నంగా ఉంటుంది. దీనికి ప్రధాన కారణం దేశంలోని వివిధ ప్రాంతాల్లో తేయాకు పండించే విధానం, దాని ప్రాసెసింగ్ పద్ధతుల్లో తేడా ఉండడమే.

ఇరానీ చాయ్‌కి సంబంధించినంత వరకు తేయాకును వారు ఇరాన్ నుండే దిగుమతి చేసుకుంటారు. అయితే అందులో కలిపే ప్లేవర్ల గురించి ఇసుమంత కూడా చెప్పడానికి వారు ఇష్టపడరు. ఒక రకంగా చెప్పాలంటే ‘ఇరానీ చాయ్ కుతుబ్ షాహీల దత్తపువూతిక’ అనడంలో సందేహం లేదు. వారి పాలన సమయంలో కొన్ని డ్రింక్స్, లిక్కర్లు కూడా ప్రాచుర్యం పొందాయి. వాటిలో వైట్, రెడ్ వైన్స్ ముఖ్యమైనవి. అయితే ఇవి కేవలం సంబంధిత సీజన్‌లలో మాత్రమే దొరికేవి. కానీ ఇరానీ చాయ్ మాత్రం ఎల్లవేళలా దొరికేది. అందుకే ఇరానీ చాయ్‌కి ఇంతటి గుర్తింపు వచ్చింది. ఇప్పుడు ఇరానీ చాయ్ అంటే హైదరాబాదీలకు ముత్యాలు, బిర్యానీ, మీనార్స్ ఎలాగో అచ్చం అలాగే.
షాలీబండ టూ క్లాక్ టవర్: ఒకప్పుడు హైదరాబాద్ నగరాన్ని చుడితే అడుగడుగున మనకు ఇరానీ హోటల్స్ కనిపించేవి. పాతబస్తీలోని షాలీబండ నుండి సికింవూదాబాద్‌లోని క్లాక్ టవర్ మధ్యలో 29 ఇరానీ కేఫ్స్ ఉండేవి. వీటిలో ఇప్పుడు కొన్ని మూసి వేశారు. మరికొన్ని నగర అభివృద్ధిలో భాగంగా తొలగించబడ్డాయి.
రకరకాల చాయ్‌లు
ఇరానీ చాయ్‌కి ప్రత్యేక కేఫ్‌లున్నట్లే వివిధ రకాల చాయ్‌లకు కూడా ప్రత్యేక కేఫ్‌లున్నాయి. జంటనగరాల్లో ప్రఖ్యాతిగాంచిన టీ కొట్లు కూడా ఉన్నాయి. బ్లూసీ, ఆల్ఫా, తాజ్ (అబిడ్స్) వంటి ప్రధాన హోటల్స్‌లో ప్రత్యేక టీలు విక్రయిస్తుంటారు. బర్కాస్, కింగ్‌కోఠిల్లోనూ వివిధ రకాల చాయ్‌లు అందుబాటులో ఉన్నాయి. మసాల చాయ్, కాశ్మీరీ టీ, గోల్డెన్ టీ, స్పెషల్ టీ, గవా టీ, బ్లాక్‌టీ వంటి ప్రజలకు అందుబాటులో ఉంటున్నాయి. ఇవేకాక మిల్క్‌పౌడర్, మిల్క్‌మేడ్, చాకొలెట్, బిస్కట్ ప్లేవర్, ఇలాచీ, అల్లం, లెమన్, పౌనా (ఎక్కువ పాలతో చేసే టీ) వంటీ వెన్నో కూడా అందుబాటులో ఉన్నాయి. ఇవన్నీ మామూలు చాయ్ ధరలతో పోలిస్తే అధిక ధర పలుకుతాయి.
కోట్లలో వ్యాపారం...
జంటనగరాల్లో ఇరానీ చాయ్ లేదా చాయ్ అనేది అతి పెద్ద వ్యాపారం. వేలాదిమంది నిరుద్యోగులకు ఉపాధిమార్గం కూడా ఇదే. పెద్ద పెద్ద హోటల్స్‌లో ప్రతి రోజు కనీసం వెయ్యి చాయ్‌లు విక్రయించబడుతున్నాయి. మరికొన్ని హోటల్స్‌లో రోజుకు 1,500 వరకు టీలను విక్రయిస్తున్నారు. ఈ లెక్కన 25,000 హోటల్స్ ఉంటే ఉదయం 6 గంటల నుండి రాత్రి 10 గంటల మధ్య కాలంలో 2.5 కోట్ల టీలు విక్రయిస్తున్నారనుకోవాలి. ఒక చాయ్‌కి సగటున నాలుగు రూపాయలు వేసుకున్నా ఒక నెలలో రూ.300 కోట్ల బిజినెస్ కేవలం టీ విక్రయాలే మీదే జరుగుతుందన్నమాట. అంతెందుకు, జంటనగరాల్లో ఉన్న ప్రతి 200 మందికి ఒక టీస్టాల్ ఉందంటే నమ్ముతారా?
ఎందందరికో ప్రీతిపాత్రం...
హైదరాబాద్ ఇరానీ చాయ్‌కి ఫిదా కానీ వారంటూ లేరంటే అతిశయోక్తికాదు. హైదరాబాదీ కవులుగా ముద్రపడ్డ పలువురు ఇరానీ కేఫ్‌ల్లోనే తమ కవితలకు ప్రాణం పోశారు. ఒక చేతితో సిగరేట్ మరో చేత్తో కలం పట్టుకుని మధ్య మధ్యలో ఇరానీ చాయ్‌ని చప్పరిస్తూ వారు ఎన్నో కవితలల్లారు. దిగంబర కవులుగా పిలువబడే నిఖిలేశ్వర్, నగ్నముని, జ్వాలాముఖి, చెరబండరాజు, భైరవయ్య, మహాస్వప్నల కవిత్వమంతా అబిడ్స్‌లోని ‘కింగ్ సర్కిల్’ ఇరానీ కేఫ్‌లోనే ఉద్భవించిందంటే ఒకింత ఆశ్చర్యమే. అక్కడ ప్రస్తుత పోలీస్‌స్టేషన్ పక్కనే ఉన్న భవనంలో మొదటి అంతస్తులో ఈ కేఫ్ ఉండేది. బన్ను, సమోసాలు, ఉస్మానియా బిస్కట్లు తింటూ ఇరానీ చాయ్ ఆస్వాదిస్తూ వీరంతా గంటలు, గంటలు తమ చర్చలు జరిపేవారట. ‘‘1966-68 మధ్యకాలంలో మూడు సంవత్సరాలు మాకు ‘కింగ్ సర్కిల్’ ప్రధాన స్థావరంగా ఉండేది. 
       మాకు సర్వ్ చేయడానికి ఒక తెలుగబ్బాయి ఉండేవాడు. వివిధ అంశాల మీద చర్చిస్తూ గంటలు, గంటలు అక్కడే గడిపేవాళ్లం. తరువాత ఆబిడ్స్ పోస్టాఫీస్ సందులో కూడా ఒక కేఫ్ ఉండేది. ఇప్పుడుందో లేదో తెలియదు. ఇరానీ చాయ్ అనగానే అప్పటి రోజులే గుర్తుకు వస్తాయి.’’ అని దిగంబర కవుల్లో ఒకరైన నిఖిలేశ్వర్ తన పాత జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు. వీరితో పాటు ఎందరో ప్రముఖ కవులు ఇరానీచాయ్ తాగుతూనే తమ కథలు, కవితలు, అభివూపాయాలను కాగితంపై పెట్టారంటే అతిశయోక్తికాదు. ఇట్లా ఎంతోమంది కవులకు ఇరానీ చాయ్ కలం, బలం, జీవం, జవం అవుతోందన్నది వాస్తవం.          
     తెలంగాణ ప్రాంతానికి చెందిన జానపద సినిమా హీరో దివంగత కత్తి కాంతరావుకు కూడా ఇరానీ చాయ్ అంటే ఎంతో మక్కువంటారు. ఆయనకు ఎన్ని పనులున్నా కూడా‘టీ డెన్ కేఫ్’కు తప్పకుండా వెళ్లి చాయ్ తాగి వచ్చేవారట. అలాగే, ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఓవైసీ కూడా ఇరానీ చాయ్‌కు ఫ్యాన్. ఆయన కింగ్‌కోఠిలోని ఫ్యాన్సీ కేఫ్‌కు తప్పకుండా వెళ్తారు. అంతర్జాతీయ గుర్తింపు పొందిన చిత్రకారుడు ఎం.ఎఫ్ హుస్సేన్ నగరానికి వచ్చినప్పుడు సికిందరాబాద్‌లోని గార్డెన్ రెస్టాంట్‌కు వెళ్ళేవారట.

ఇంకా అందని ద్రాక్షలా ఇరానీ చాయ్
ఇరానీ చాయ్ ధర ఇప్పుడు సామాన్యునికి అందకుండా పోతోంది. ఒకప్పుడు 2 రూపాయల వరకు ఉన్న దీని ధర పెరుగుతూ పెరుగుతూ వచ్చి పది రూపాయలకు చేరింది. ఇప్పుడు మరింత ధర పెరిగింది. దిగుమతి సుంకాలు పెరగడం, ఉత్పత్తి తగ్గడం వంటివి కూడా ధర పెరగడానికి కారణమవుతున్నాయి. గత కొంతకాలంగా పాలు, చక్కెర, ఇరానీ తేయాకు ధరలు ఆకాశాన్నంటడంతో ఇరానీ చాయ్ ధర పెంచక తప్పని పరిస్థితి ఏర్పడిందని జంటనగరాల కేఫ్ యాజమానులు అంటున్నారు. కేఫ్‌లలో పనివారి జీతాలూ పెరగడం దీనికి మరో కారణమంటున్నారు. గడచిన కొద్ది రోజులుగా మాములు చాయ్ ధర మూడుసార్లు పెరిగింది. మొదట 5 రూపాయలున్న ధర 6రూ. తరువాత 8.రూ. ఇప్పుడు రూ. 10కి చేరింది. కొన్ని హోటళ్లు మాత్రం ధరను స్వల్పంగా పెంచాయి. వాటిల్లో రూ.9కే ఇరానీ చాయ్ ఇస్తున్నారు. టీ పౌడర్ ధర కిలోకు రూ.20 పెరగడం, చక్కెర క్వింటాలుకు రూ.400 నుండి రూ.600 ల మధ్య ఉండడం, పాల ధర లీటరుకు రూ.2 నుండి 4 రూపాయలు పెరగడంతో ఇరానీ చాయ్ ధర పెంచక తప్పని పరిస్థితి ఏర్పడింది. దీంతో ఎన్నో సంవత్సరాల చరిత్ర ఉన్న కేఫ్‌లకూ గిరాకీ తగ్గింది. చిన్న చిన్న టీ స్టాల్స్ కూడా అధికం కావడంతో పోటీని తట్టుకోవడంలో కొన్ని కేఫ్‌లు వెనుకబడుతున్నాయి.
       ఇరానీ చాయ్, ఉస్మానియా బిస్కట్, సమోసా, బన్ను అన్నదమ్ములే!
ఇరానీ చాయ్ అనగానే మనకు గుర్తుకు వచ్చేది ఉస్మానియా బిస్కట్. ఇరానీ కేఫ్‌కు వెళ్లి మనం చాయ్ ఆర్డర్ ఇవ్వగానే చాయ్‌తో పాటు ఎక్స్‌ట్రా కప్పు, ఒక సాసర్, ఒక ప్లేట్‌లో ఉస్మానియా బిస్కట్లు ఇవ్వడం ఆనవాయితీ. బిస్కట్స్ ఆర్డర్ ఇవ్వకున్న తెచ్చి ఇవ్వడం అనేది ఇరానీ కేఫ్‌ల సంప్రదాయంలో ఒక భాగం. తినడం తినకపోవడం మన ఇష్టం. ఇక రోజువారి పనుల్లో బిజీగా ఉండి భోజనం చేయని వారికి ఇరానీ చాయ్, బిస్కట్లే ఆహారం.
        ఇరానీ హోటళ్లలో మరో ప్రత్యేకత చాయ్ సమోసా, చాయ్ బన్ను. ఈ మూడు కాంబినేషన్‌లలో ఏదో ఒకటి తప్పకుండా మనకు కనపడుతుంది. ఉస్మానియా బిస్కట్లకు హైదరాబాద్‌కు ఉన్నంత చరిత్ర ఉంది. నిజాం కాలం నుండి కూడా ఇరానీ చాయ్ బిస్కట్లకు విడదీయరాని బంధం ఉంది. నిజాం చివరి పాలకుడు మీర్ ఉస్మాన్ ఆలీఖాన్ పేరు మీదే వీటికి ఉస్మానియా బిస్కట్లు అన్న పేరు స్థిరపడింది.                     -బతుకమ్మ నుండి... 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి