హోం

21, డిసెంబర్ 2012, శుక్రవారం

కాకతీయ సంబురం..!

మూడు రోజుల ముచ్చటైన పండుగ

ఎన్నాళ్ల నుంచో ఎదురుచూసిన వేడుక ఇవ్వాటి నుంచి ఎదురుపడుతుంది. కాక‘తీయ’ని సంబురం కన్నుల పండుగ చేయబోతున్నది. దక్షిణ భారతంలో మూడువందల ఏళ్ల ఏకచ్ఛతాధ్రిపత్య పాలన ఆనవాళ్లను చరిత్రలోకి తొంగిచూసే అపురూప సన్నివేశాలు ఓరుగల్లు వాకిట ఆవిష్కృతం కానున్నాయి. కాకతీయ శిల్పకళా సాహిత్య సాంస్కృతిక అంగాల రంగాలు పల్లవించిన సువర్ణాధ్యాయపు చరిత్రను దోసిటపట్టుకునేందుకు ఓరుగల్లు తనను తాను తవ్వుకొని చూపించబోతున్నది. నిర్లక్ష్యపు మస్తిష్కపు ఆనవాళ్ల బూజు దులుపి బురుజుగోడలపై వేలాడదీసేందుకు చరిత్రకారులు, చరిత ఉన్న నగరంలో చారిత్రక పాత్రను పోషించేందుకు సిద్ధమవుతున్నారు.

ఖండాంతర కలాఖండపు అమ్ములపొది ఢమరుక విన్యాసంతో ఊగిపోయేందుకు రామప్పగుడి సాలబంజికల భంగిమలు నాగకన్యికలు నాట్యమాడి పులకించేపోయే చారిత్రక సందర్భం. వేయి స్తంభాల్లో కొలువైన శివరుద్రుడి వెలుగుల జిలుగులు విశ్వవీధిన కురిపించేందుకు మురిసిపోతున్నాడు. ఏలికా నగరి ఏకశిలాపురి శిల్పసంపద శోభాయమానం అయ్యే శుభదినం కోసం ఎదురుచూస్తున్నది. ఇవ్వాటి నుంచి మూడు రోజులపాటు ఓరుగల్లంతా పండుగ వాతావరణం. ప్రతిమనిషీ రాజదర్పాన్ని ప్రదర్శించే అపురూప సన్నివేశాలు ఎన్నో ఆవిష్కరణ కాబొతున్నాయి. యేడాదిపొడవునా సాగిపోయే (సర్కారు సంవత్సరం పాటు నిర్వహిస్తామని చెబుతున్న నేపథ్యంలో) ఉత్సవ వేడుకల ఆరంభ సంరంభానికి అంతా సిద్ధమైంది (అధికారులు చెబుతున్నట్టుగా కాకపోయినా..). సర్కారు చెబుతున్నది అంతా ఆచరించని డొల్లతనమే అయినా, కాకతీయుల పాలనా విధానపు గొప్పతనాన్ని తవ్వితీసుకుని తన్మయత్వం పొందేందుకు చరిత్ర వర్తమానమైంది. కాకతీయులు అందించిన గొలుసుకట్టు మణిహారపు మాధుర్యాన్ని అనుభవించిన నేలతల్లి మళ్లీ ఆరోజులు రావాలని కలలు కంటున్నది. మొత్తంగా ఒక చరిత్ర వర్తమానంలో పరిభ్రమిస్తున్నది. 

from namaste telangana

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి