హోం

7, ఫిబ్రవరి 2013, గురువారం

తెలంగాణ భగత్ సింగ్-నారాయణ రావు పవార్.


నారాయణ రావు పవార్ స్వాతంత్ర సమర యోధుడు. నారాయణ రావు పవార్ 1926 వ సంవత్సరం, అక్టోబరు నెల మూడవ తారీఖున వరంగల్లు నందు పుట్టారు. ఇతనికి నాలుగేళ్ల వయసులోనే మాతృవియోగం కలిగినది. 1944 లో ఇంటర్ పాస్ అయి లా కోర్సు చేయాలని అందులో చేరగా ఆర్థిక పరిస్తితుల కారణంగా దాన్ని కొనసాగించ లేక పోయాడు. రేషన్ డిపార్ట్ మెంటులో ఎన్యుమరేటర్ గా చేరి కొంత ఆర్థికంగా నిలదొక్కుకొని లా కోర్సు చేయడానికి హైదరాబాద్ వచ్చాడు. ఇతను ఎనిమిదవ తరగతిలో వుండగానె ఆర్య సమాజంతో సంబందాలుండేవి. అందు లోని పండిత రుద్రవ్, పండిత నరేంద్ర దేవ్ లు ఇతనికి గురువులు. వారితో కలసి అప్పట్లో మత మార్పిడులను అడ్డుకునేవారు. రాత్రి పూట హరిజన బస్తీలలో బడులు నడిపి వారి పిల్లలకు విద్య గరిపే వారు. మాల మాదిగలతో తిరుగు తున్నందున తండ్రికి కోపంగా వుండేది. ఇంటోకి రావాలంటే బయటే బట్టలు తీసేసి, స్నానం చేసిన తర్వాత లోపలికి రానిచ్చే వారు. అలాగె నడుచు కున్న నారాయణ రావు గాంధీ జీ అస్పృస్యత పై వున్న ఉపన్యాసాలను తండ్రికి వినబడేటట్లు గట్టిగా చదివే వాడు. దాంతొ తండ్రి ప్రవర్థనలొ కొంత మార్పు వచ్చింది. హైదరాబాద్ కు వచ్చింతర్వాత కొంత మంది యువకులను చేరదీసి "యువ క్రాంతి దళ్" ఏర్పాటు చేశారు. దానికి కొండాలక్ష్మణ్ సలహాదారుగా వుండి కొంత ఆర్థిక సహాయం కూడ చేసే వారు. ఆవిధంగా ఆర్య సమాజ కార్యక్రమాలలో పాలుగొంటూ "లా" కోర్సును కూడ కొనసాగించాడు. 1946 లో ఒక సారి దారుసలాం మైదానంలో మహమ్మదాలి జిన్న ప్రసంగాన్ని విన్నాడు. రెచ్చగొట్టే అతని మాటలు జీర్ణించు కోలేక పోయాడు. ఏదైనా సాహసం చేయాలని అపుడే నిర్ణయించు కున్నారు నారాయణరావు మిత్ర బృందం. . కాని ఏది? అనే స్పస్టత లేదు. "లా" కోర్సు లో భాగంలో ప్రతి రోజు హైకోర్టు లో జరిగే వకాలత్ కోర్సులకు వెళ్లే వాడు. ఒక నాడు వకాలత్ కోర్సుకు వెళుతుండగా నారాయణ రావు మిత్రుడు వకాలత్ క్లాసులు ఎలా వుంటాయో చూడాలని వెంట వచ్చాడు. ఆలా వారు వెళు తుండగా నయాపూల్ బ్రిడ్జి వద్ద పోలీసులు ట్రాపిక్ ను ఆపేశారు. ప్రతి రోజు నిజాము నవాబు దారుల్ షిపా లోని తన తల్లి సమాధిని దర్శించు కోడానికి వెళ్లి వస్తుంటాడు. అసమయాలలో పోలీసులు ట్రాపిక్ ను ఆపేస్తారు. నిలబడి వున్న నారాయణ రావు మిత్రబృందం కారు లో వెళుతున్న నిజామును చూశారు. అప్పుడు మిత్రబృందలోని ఒకడు అనాలోచితంగా, హటాత్తుగా తన మిత్రులతో " నిజామును చంపేస్తె........" అన్నాడు. ఆతరవాత ఆసంగతి ఎవరు మాట్లాడు కోలేదు. కొన్ని రోజుల తర్వాత మితృడు బాలకిషన్ ఆ రోజు అనుకున్నట్లు నిజామును చంపాలని నిర్ణయించు కున్నట్లు నారాయణ రావుకు చెప్పాడు. అందరు సరే ననుకొని ప్రణాళికను రూపొందించు కున్నారు. వీరందరూ సుభాష్ చంద్ర బోస్ ఉపన్యాసాలను శ్రద్దగా చదివేవారు. అందులో అతని నినాదం "మీరు మీ రక్తాన్నివ్వండి..... నేను మీకు స్వాతంత్రం ఇస్తాను... " అన్న మాటలు వీరందరినీ ఉర్రూత లూరించింది. దాంతో ఇ మిత్రులందరు ......బాంబులేసి నైజామును చంపాలని....... ప్రాణ త్యాగానికైనా సిద్ద పడాలని నిర్ణయించు కున్నారు.
నారాయణ రావు, పండిత విశ్వనాథ్ బొంబాయి వెళ్లి బాంబులు కొనాలని బయలు దేరారు. మార్గ మద్యలో షోలా పూర్ వద్ద లక్ష్మణ రావు బాపూజీ వీరికి కనబడ్డాడు. అప్పటికే లక్ష్మణ రావు ప్రముఖ క్రిమిల్ లాయరు. బాంబు లెందుకని లక్ష్మణ రావు అడగ్గా/..... రజాకార్లను చంపడానికని అబద్దం చెప్పారు. దాంతో అతను నిజామునె ఎందుకు చంప కూడదు? అని సూటిగా అన్నాడు. దాంతో వీరు అసలు సంగతి చెప్పేసారు. దాంతో లక్ష్మణ రావు వీరికి ఆరు వందల రూపాయలిచ్చి జాగ్రత్తలు చెప్పి పంపాడు. బొంబాయిలో రెండు బాంబులు కొని తిరుగు ప్రయాణంలో షోలాపూర్ లో లక్ష్మణ రావును కసిలి రెండు రివ్వలర్లను అడిగి తీసుకున్నారు. బాంబులు విఫల మైతె రివాల్వర్ తో పని కానిచ్చాలని వీరి పథకం. చివరకు మూడు విషం సీసాలను కూడ అడిగి తీసుకున్నారు. మొదటి రెండు పధకాలు విపలమైతే మూడో మార్గంగా విషం తీసుకుని చావలని వీరి పథకం. హైదరాబాద్ వచ్చి వివరంగా ఒక ప్రతిజ్ఞా పత్రాన్ని తయారు చేశారు. వీరు నిజాంను ఎందుకు చంపాలను కున్నది? దాని సారాంశం ఒక పత్రంలో రాసి, ఆరాసిన నకలును నారాయణ స్వామి వద్ద వుంచారు. పథకం అమలు చేసిన రోజు నారాయణ స్వామి బెజవాడ వెళ్లి ఆనకలు పత్రాన్ని, ముగ్గురు మిత్రులు కలిసి తీసుకున్న పోటోను, పత్రికల వారికి, రేడియో వారికి అంద జేయాలని ముందె నిర్ణయించు కున్నారు. ప్రతిజ్ఞా పత్రంపై ముగ్గురు మిత్రులు అనగా నారాయణ రావు పవార్ జగదీష్, గండయ్య తమ రక్తంతో సంతకం చేశారు. డిసెంబరు నెల నాల్గవ తారీఖు 1947 సాయంకాలం నాలుగు గంటల సమయం..........కింగ్ కోటి రోడ్డు, నిజాం నివాసంముందు. రోడ్డు పై ముగ్గురు మిత్రులు దూర దూరంగా అక్కడక్కడా నిలబడాలి, మొదటి వ్యక్తి విఫలమైతే రెండో వాడు పని కానిచ్చాలి, అక్కడా తప్పితే మూడో వాడు పథకాని అమలు కానివ్వాలి. ఇది వారి పథకం. కింగ్ కోటి రోడ్డులో ప్రతి చౌరస్తా వద్ద ఒక పోలీసు మరొక జవాను వున్నారు. కానిస్టేబుల్ ట్రాపిక్ ను నియంత్రిస్తే జవాను ఆచుట్టు పక్కల తిరుగుతున్న జనాలపై నిఘా పెడుతున్నాడు. నారాయణ రావు గల్లీలోంచి రోడ్డు పైకి వచ్చి తన సైకిల్ ను గోడకు ఆనించాడు. ఇది జవాను గమనించాడు. అప్పటికే నిజాము కారు రెండో కానిస్టేబులు వద్దకు వచ్చింది. ఇంతలో నారాయణరావు సంచిలో నుండి బాంబును బయటి తీసి దాని 'పిన్' లాగి నిజాం వస్తున్న కారు పైకి విసిరాడు. అది పెద్ద శబ్దంతో పేలి పోయింది. అది పడ్డ ప్రదేశంలో పెద్ద గొయ్యి ఏర్పడింది. ముగ్గురు సాధారణ పౌరులు తీవ్ర గాయ పడగా ఒక చిన్న పిల్ల అక్కిడికక్కడే మరణించింది. కారు మాత్రం తప్పించు కుంది. నారాయణ రావు జేబులో చేయి పెట్టి రివాల్వర్ తీసే లోపె జవాను వచ్చి అతని చెయ్యి పట్టుకున్నాడు. అతను విషం మింగే అవకాశం కూడ లేదు. బాంబు శబ్దం విన్న మిగతా ఇద్దరు పథకం సఫలం అయిందని అక్కడి నుండి తప్పుకున్నారు. లేక పోతే నిజాముకు ఇదే ఆఖరి రోజు అయ్యెది.
నారాయణ రావును పోలీసులు చుట్టుపక్కల వున్న ప్రజలు విచక్షణా రహితంగా కొట్టారు. ఒకడు రాయి తో మూతి మీద కొట్టగా పళ్ళు రాలి పోయాయి. బాంబు పేలిన ప్రాంతంలో ఒక డాక్టర్ గారి ఇల్లు వున్నది. నిజాం కారు డ్రవర్ తెలివిగా కారును ఆ ఇంటి లోనికి పోనిచ్చాడు. నారాయణ రావు బాంబు వేస్తున్నప్పుడు మొదట చూసిన వ్యక్తి ఆ డాక్టర్ ఇంటి వాచ్ మాన్. అతను అరబ్బువాడు. వాడు నారాయణ రావు ను తన మొలలో వున్న బాకు తీసి చంప బోయాడు. అక్కడున్న ఇనస్పెక్టర్ చేయి అడ్డం పెట్టి "ఇప్పడే చంపొద్దు...రహస్యాలు రాబట్టాలి " అని వారించాడు. అతని చేతికి గాయం అయింది. కోర్టు విచారణ లో కూడ ఈ అరబ్బు కాపలాదారుడే మొదటి సాక్షి. పోలీసు స్టేషన్ లో విచారణ సమయంలో మనారాయణ రావుని నీవు హిందువువా మిస్లిం వా , నీ పేరేమిటని అడగ్గా హిందు/ ముస్లిం తేడా తెలియకుండా వుండ డానికి తన పేరు "బాబు" అని అన్నాడు. కాని పోలీసులు నారాయణ రావు బట్టలన్నీ వూడ దీసి అతను హిందువని నిర్దారించారు. ఇంతలో నైజామ్ ప్రధాని మీర్ లాయక్ అలి అక్కడికి వచ్చి నారాయణ రావునుద్దేసించి "నిన్ను ఎవరు పంపారు? రాజ కుటుంబీకులా? లేక సర్దార్ పటేలా? " అని ప్రశ్నింఛాడు. దానికి నారాయణ రావు తనే స్వయంగా ఈ పనికి పూనుకున్నానని చెప్పాడు. అలా రెండు రోజులు పలు రకాలుగా చిత్ర హింసలు పెట్టారు పోలీసులు. ఆ మరు దినం ఎదురు సెల్ గదిలో గండయ్య వున్నాడు. అతను అద్దెకు తీసుకున్న సైకిల్ పైన వున్న పేరును బట్టి దాని ఆదారంతో పోలీసులు గండయ్యను అరెస్ట్ చేశారని ఆ తర్వాతి తెలిసింది. పోలీసులు వరంగల్లు వెళ్లి నారాయణ రావు ఇంటిని శోధించారు. నారాయణ రావు తండ్రి తన కొడుకు అంత సాహసికుడు కాదన్నాడు. నిజ నిర్దారణకు, అతడిని హైదరాబాదు తీసుకొచ్చి ఖైదిని చూపగా అతడు తన కొడుకే నని ఒప్పుకున్నాడు. ఆ తండ్రి తన కొడుకు ఇంత పని చేశాడని కోప్పడలేదు, కొట్టలేదు, అసహ్యించు కోలేదు. కొడుక్కి అంతా మంచి జరుగు తుందని, దేవుడు రక్షిస్తాడని, దైర్యం చెప్పాడు కొడుక్కు. నారాయణ రావు తన కేసును వాదించ డానికి ఏ వకీలును నియమించు కోలేదు. తన కేసును తనే వాదించు కున్నాడు. విచారణ సమయంలో నారాయణ రావు తండ్రి వచ్చి నప్పుడు మిఠాయి తెచ్చి ఇచ్చే వాడు. దైర్యం చెప్పేవాడు. నారాయణ రావు విచారణ సందర్బంలో తను తయారు చేసుకున్న ప్రతిజ్ఞా పాటాన్ని మళ్లి, మళ్ళి చెప్పేవాడు. నారాయణ రావు తండ్రి తనయుడి విడుదల కొరకు, పండరి నాథుడు విఠల్ దేవునికి మొక్కుకొని జుట్టు, గడ్డం, మీసాలు పెంచి సాధువులా జీవించాడు. చివరకు అత్యున్నత న్యాయస్థానం నారాయణ రావు పవార్ కు ఉరి శిక్ష విధించింది. అపుడు నారాయణ రావు పవార్ గర్వంగా "సర్ కటా సక్తే హై లెకిన్ స్ర్జుఆ సక్తే నహీ" అని పండిత రాం ప్రసాద్ బిస్మిల్ల కవిత చరణాలను బిగ్గరగా పాడుకున్నాడు. ..................................................కాని............... 1948 సంవత్సరం, సెప్టెంబరు 17 న నిజాము నవాబు వల్లబాయి పఠేల్ ముందు లొంగి పోగా, హైదరాబాద్ స్టేట్ స్వతంత్ర భారత్ లో విలీనం అయి పోయింది. ఆ తర్వాత నారాయణరావు పవార్ ను అతని అనుచరులకు ఇతర కేసులలో వున్న నిందితులకు క్షమాబిక్ష లబించింది......................... ఇంతటి ధీరోదాత్త సంఘటనకు తగు ప్రచారం లబించ లేదు. 

                          2009 లో క్విట్ ఇండియా దినం సందర్భంగా ఆయనకు రాష్ట్ర పతి నుండి పిలుపు వచ్చింది, ఆయనను ప్రభుత్వం సన్మానించి గౌరవించింది. ఆయన డిసెంబర్12, 2010 న తుది శ్వాస విడిచారు.

1 కామెంట్‌:

  1. నిజామ్ అప్పుడె చచ్చిఉంటే ఎంత బాగుండేది. ఆ తరువాత ఖాసిం రజ్వీని కూడ చంపేవాడు.

    రిప్లయితొలగించండి